న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 30 జూన్ 2026: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాలకు అందించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పేదింటి మహిళలు సద్వినియోగపరుచుకోవాలని సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి తో కలిసి సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్ పహాడ్, సూర్యాపేట అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు రూ.1,50,17,400 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని వీటిని ప్రతి ఒక్క పేదింటి మహిళ సద్వినియోగపరుచుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

అనంతరం కొప్పుల వేణారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులు పొందిన లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు.












