జూన్ 30 నుంచే వానకాలం రైతుభరోసా, జులై 15లోపు రైతులందరికీ పూర్తిగా జమ

***రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను సిద్ధం చేసింది…

న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 29.06.2026:

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు.. కోటి 50 లక్షల ఎకరాలకు.. ఎకరాకు 6 వేల చొప్పున జమ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. పెట్టుబడి సాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి నిధులు కేటాయించింది. ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయి ఉన్న వివిధ రకాల ఏరియర్స్ చెల్లింపుల కోసం ప్రతినెలా ఇస్తామని చెప్పిన దాదాపు రూ.2వేల కోట్లను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఈ బకాయిలను కూడా జులై నెలలోనే పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూనే, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల బకాయిలను చెల్లించనుంది. రాబోయే జులై నెలలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, పరిపాలన కోసం అత్యంత భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతోంది. సాధారణంగా వచ్చే నెలవారీ ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు రూ. 6 వేల కోట్లతోపాటు రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలులాంటి ఇతర ముఖ్యమైన పథకాలను కలుపుకొని జులై ఒక్క నెలలోనే దాదాపు రూ.20వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇంతటి భారీ మొత్తాన్ని ఒకేసారి సర్దుబాటు చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఆర్‌బీఐ నుంచి సుమారు రూ.11,500 కోట్ల మేర రుణం సేకరించడంతోపాటు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయ వనరులను (స్టేట్ ఓన్ రెవెన్యూ) కూడా దీనికి తగ్గట్టుగా మళ్లించనున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా లభించే నిధులను సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జులై నెల ఖర్చులను అధిగమించేందుకు ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *