
![]()
***500 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం స్వాహా…
***కేసులు అంటే లెక్క లేదు,.. ***జైలుకు అంటే బెయిల్ సిద్ధం…
***బొక్కిన బియ్యం కక్కేది ఎన్నడు?…
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

డాక్టర్ కృష్ణ బంటు,
గోల్డ్ మెడలిస్ట్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత.

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 03 ఆగస్టు 2026: సూర్యాపేట జిల్లాలో కష్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) విషయంలో మిల్లర్ల మాయజాలం కారణంగా అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. 2022 – 23 సీజన్ నుండి ఈ అక్రమాలకు మిల్లర్లు తెర లేపారు. సుమారు 500 కోట్ల రూపాయల పైగా సీఎంఆర్ విషయంలో ధాన్యాన్ని బియ్యంగా మార్చి సదర్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి మిల్లర్లు సొమ్ము చేసుకున్నారని సంబంధిత అధికారుల తనిఖీల్లో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రంగంలోకి దిగి తనిఖీలను ముమ్మరం చేయడంతో అసలు అక్రమాలు బహిర్గతం అయ్యాయి. గత రెండు వారాలుగా సూర్యాపేట జిల్లాలోని పలు రైస్ మిల్లులలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందాలు, సివిల్ సప్లై అధికారులతో కలిసి సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించి మిల్లర్ల బండారాన్ని బయటపెడుతున్నారు. 2022 నుంచి 2023, 2024, 2025, 2026 సంవత్సరాలలో వ్యవసాయ సీజన్లకు సంబంధించి సీఎంఆర్ రైస్ ఇచ్చే విషయంలో మిల్లర్లు ముందుకు రాకపోవడంతో ఆగస్టు 5వ తేదీ వరకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చినప్పటికీ మిల్లర్లు అందుకు సిద్ధంగా లేకపోవడంతో అసలు మిల్లులో ఎంత మేర ధాన్యం నిల్వలు ఉన్నాయని తెలుసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టిన అధికారులకు కళ్ళు బైర్లు కమ్మేలాగా అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు అధికారులు పక్కా ఆధారాలు సేకరించి సంబంధిత బిల్లులను సీజ్ చేశారు. చట్ట ప్రకారం చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యులతో కూడిన స్పెషల్ టీం అక్రమాలు జరిగిన మిల్లుల రికార్డులు అన్నిటిని వడబోస్తుంది.
మిల్లర్లు ఆడింది ఆట.. పాడింది పాట… అందుకే అధికారుల అక్రమాల వేట: సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం గాంధీనగర్ లో గల వజ్ర వికాస్ రైస్ మార్ట్, వజ్ర రైస్ కార్పొరేషన్ లలో 73 కోట్ల రూపాయల విలువైన 29,197 టన్నులు, కాసర బాద శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో 27. 23 కోట్ల విలువైన 11,400 టన్నులు, రవి కృష్ణ రైస్ మిల్లులో 47.62 కోట్ల రూపాయల విలువైన 12 టన్నుల సిఎంఆర్ మాయమైనట్లు గుర్తించి మిల్లులు సీజ్ చేసి నిర్వాకులపై కేసులు నమోదు చేశారు. ఇంకా జిల్లాలోని తిరుమలగిరి మండలం అన్నారం లో ఏఎస్ ఆర్ రైస్ మిల్లులో 46 కోట్ల విలువైన 19,701 టన్నులు, జెపి రైస్ మిల్లులో 11.67 కోట్ల విలువైన 4,886 టన్నుల సీఎంఆర్ పక్కదారి పట్టినట్లు గుర్తించారు. చింతలపాలెం మండలం దొండపాడు శివసుబ్రహ్మణ్యేశ్వర మోడ్రన్ రైస్ మిల్లులో 4.89 కోట్ల విలువైన 2,050 టన్నులు, సూర్యాపేటకు చెందిన శివ సాయి రైస్ మిల్లులో సుమారు 13 కోట్ల రూపాయల విలువైన 2,900 టన్నుల సిఎంఆర్ రైస్ మాయమైనట్లు గుర్తించారు. మొత్తంగా 224 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు తేల్చారు. 2022 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు సీజన్ల ప్రకారం ధాన్యం నిల్వలలో భారీగా వ్యత్యాసాలు చోటు చేసుకున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు.
కేసులంటే లెక్కలేదు… బొక్కిన బియ్యం కక్కేది లేదు…!!: సీఎంఆర్ బియ్యాన్ని మింగిన అవినీతి మిల్లర్లకు కేసులంటే లెక్కలేదు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్లిన విధంగానే జైలుకు అలా వెళ్లి బెయిల్ తో ఇలా తిరిగి రావడం వారికి పరిపాటిగా మారింది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అవినీతి మిల్లర్లు జగత్ జంత్రీలు, మహా కంత్రిలు అని పలువురు పేర్కొంటున్నారు. ప్రజాధనాన్ని స్వాహా చేసి యదేచ్ఛగా సమాజంలో తిరుగుతూ తాము నీతిమంతులమే అన్నట్టు బిల్డప్పులు ఇవ్వడం అవినీతి మిల్లర్లకు అలవాటైపోయిందనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఎంత బియ్యాన్ని బొక్కారో అధికారులు నిగ్గు తేల్చి వడ్డీతో సహా కక్కించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇంకా ఏమేమి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.












