Loading

కేబుల్ టీవీ రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు…

ఆంధ్రా పత్రికలు, ఛానళ్లపై ఉన్న ప్రేమ కేబుల్ టీవీ జర్నలిస్టులపై ఎందుకు లేదు?: సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి…

అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా కృషి చేస్తా: కమిటీ మెంబర్ విరత్ అలీ భరోసా…

ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే భారీ మూల్యం తప్పదు: ఆనం చిన్నన్న హెచ్చరిక…

న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్ ప్రతినిధి, 19 సెప్టెంబర్ 2026: తెలంగాణలోని కేబుల్ టీవీ ఛానల్స్ రంగానికి, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి కేబుల్ టీవీ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బి.నరసింహ చారి, పొదిల వెంకట్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సు విజయవంతమైంది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేబుల్ టీవీ యాజమాన్యాలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి దృష్టికి అలాగే సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రతిఇట్లు,కేబుల్ టీవీ అసోసియేషన్,తెలంగాణ. నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ కార్డు ఇస్తే, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదనే అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి, అవసరమైతే చట్టసభల్లో (అసెంబ్లీలో) కూడా దీనిపై మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా దినపత్రికలు, ఛానళ్లపై చూపిస్తున్న ప్రేమ, తెలంగాణలో క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న అర్హులైన కేబుల్ టీవీ జర్నలిస్టులపై ఎందుకు లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రభుత్వం కేబుల్ టీవీ రంగాన్ని తీవ్రంగా చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ కార్డు మరియు రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఇచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. “ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉంది. ఆ సెల్‌ఫోన్ అనే ఆయుధం మా చేతిలో కూడా ఉంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో మీరు చేస్తున్న దోపిడీని, ఆంధ్రా పత్రికలు, ఛానళ్లకు మీరు కొమ్ముకాస్తున్న తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూనే ఉంటాం” అని యాదగిరి స్పష్టం చేశారు. అధికారులు కూడా వెంటనే స్పందించి కేబుల్ టీవీ ఛానల్స్ యాజమాన్యాలు పెట్టిన డిమాండ్లను పరిష్కరించే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు.

అక్రిడేషన్ కమిటీ మెంబర్ విరత్ అలీ మాట్లాడుతూ కేబుల్ టీవీ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు దక్కేలా నా వంతుగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

ముఖ్య వక్త ఆనం చిన్నన్న మాట్లాడుతూ కేబుల్ టీవీ రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న కేబుల్ టీవీ కానల్స్ అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్నచూపు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కేబుల్ టీవీ ప్రతినిధులు:ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ టీవీ ఛానళ్ల యాజమాన్యాలు, సీఈఓలు, వివిధ జిల్లాల నుండి వచ్చిన జర్నలిస్టులు, సాంకేతిక సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని తీర్మానించారు. కేబుల్ టీవీలను వెంటనే ప్రభుత్వ ప్రకటనల కోసం ఎంపానల్ మెంట్ చేయాలని, జిల్లా కమిటీల్లో కేబుల్ టీవీ ఛానల్స్ ప్రతినిధులకు చోటు కల్పించాలని సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ టీవీ ఛానల్స్ యాజమాన్యాలు, సిబ్బంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *