
![]()
న్యూస్ 24అవర్స్ టివి-కోదాడ/మోతే ప్రతినిధి, 19 ఆగస్టు 2026: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మోతే మండలం మామిళ్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటనలు చేయడానికే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో దళారులు, కాంట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా విక్రయించుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. పేదలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని, వారికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకోసం రెవెన్యూ లేదా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టోకెన్ విధానం అమలు చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా ఇసుక అందించాలని డిమాండ్ చేశారు. మోతే మండలం విబులాపురం గ్రామంలో 102 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారని, అప్పులు చేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో అందకపోవడంతో వడ్డీలు చెల్లిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రభుత్వం పేదల సమస్యలను పట్టించుకోకుండా కేవలం ప్రకటనలకు పరిమితం కావడం సరికాదన్నారు. ఉత్తం పద్మావతి కి రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు మరియు రీల్స్ మీద ఉన్న శ్రద్ధ పేద ప్రజల సమస్యల పరిష్కారంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అదేవిధంగా మోతే మండలంలో 22ఎల్ కెనాల్ డిజిటలైజేషన్ పనుల పేరుతో రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేసిందని, అయితే క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదని, రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని చెబుతున్న ప్రభుత్వం, అందులో వాస్తవంగా ఎంత నిధులు విడుదల చేశారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. భూసేకరణ పూర్తయిందా? భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించారా? ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? అనే విషయాలపై ప్రభుత్వం, అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో భూములు కోల్పోయిన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉన్న కాలువలకు సక్రమంగా నీరు అందించలేని పరిస్థితిలో కొత్త కాలువలు తీసుకొస్తామని ఉత్తమ్ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని బొల్లం మల్లయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. ఉన్న కాలువలను మరమ్మతులు చేసి, వాటికి అవసరమైన నీటిని అందించడంపై దృష్టి పెట్టకుండా కొత్త ప్రాజెక్టులు, కొత్త కాలువల పేరుతో ప్రచారం చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. 22 ఎల్ లిఫ్ట్ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్న ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయ్యాయో ప్రజలకు తెలియజేయాలని, పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. హెలికాప్టర్లలో తిరుగుతూ సమీక్షలు, ఆర్భాట కార్యక్రమాలు నిర్వహించడం కంటే కోదాడ నియోజకవర్గం మండలంలోని రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడంపై ఉత్తమ్ దంపతులు, అధికారులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఉత్తమ్ దంపతులకు కమిషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులపై ఫోటోలు ముద్రించే పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన నిధులను అనవసర ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేయడం సరికాదన్నారు. అదేవిధంగా కరెంటు ట్రాన్స్ఫార్మర్ లు కాలిపోతే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దీని వల్ల రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మోతే మండలాన్ని సస్యశ్యామలంగా ఉంచుటకు సాగునీరు త్రాగునీటి కొరకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి భూసేకరణ, నష్టపరిహారం, కాలువల నిర్మాణం, సాగునీటి సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
ఏపూరి సందీప్ ను పరామర్శించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే

ఇటీవల విద్యుత్ షాక్ కు గురై గాయాలపాలైన విభళాపురం గ్రామ మాజీ సర్పంచ్ ఏపూరి వీరస్వామి మనవడు ఏపూరి సందీప్ (21 ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.












