***రహదారి నియమాలు పాటించేలా తల్లిదండ్రులకు లేఖలు రాయాలని విద్యార్థులను కోరిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ…

సూర్యాపేట, న్యూస్ 24అవర్స్ టివి-15.04.2026: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమం 3వ రోజున సూర్యాపేట పట్టణ సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట టౌన్ లో గల సిటీ టాలెంట్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ హాజరయ్యారు. కార్యక్రమం ఏర్పాటు గురించి, రహదారి వినియోగంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిమాలగురించి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, రవాణా అధికారి జయప్రకాష్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు తెలిపే కరపత్రాలు పోస్టర్లను అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి, రోడ్లపై ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, రోడ్లపై నిర్లక్ష్యం జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నారు. డ్రగ్స్ వినియోగం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, ఎవరైనా తప్పుడు మార్గాలు సూచించిన తప్పుడు పనులకు ప్రోత్సహించిన వాటిని ఉపాధ్యాయుల దృష్టికి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. నిర్లక్యం వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాలను గురించి వివరించారు. తల్లిదండ్రులతో పాటు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్లపై తల్లిదండ్రులు ఆజాగ్రత్త ఉండడం వల్ల చాలా మంది పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. రోడ్డు నియమాల గురించి రోడ్లపై పాటించాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేయాలని హెల్మెట్ వాడడం సిద్ది బెల్ట్ ధరించడం గురించి వివరించాలని అన్నారు. హెల్మెట్ వినియోగించడం గురించి, సీట్ బెల్ట్ ధరించడం గురించి, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదు అనే విషయం గురించి తల్లిదండ్రులకు లేఖల ద్వారా తెలియజేయాలని అన్నారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని సీట్ బెల్ట్ పెట్టుకుంటామని మద్యం తాగి వాహనాలు నడపమని తల్లిదండ్రుల నుండి పిల్లలు ప్రామిస్ తీసుకోవాలని అన్నారు. మీపై తల్లిదండ్రులు ఎన్నో కలలు ఆశలు పెట్టుకుంటారని వీటిని నిజం చేయాల్సిన బాధ్యత పిల్లలపై ఉన్నదని అన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే రహదారులపై ప్రమాదాల సంభవించి మృత్యువాత పడతారని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు.

రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలు అందించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు డీఎస్పీ ప్రసన్న కుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎమ్మార్వో కృష్ణయ్య, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, విద్యా సంస్థల యాజమాన్యం ప్రకాష్ రెడ్డి సార్, పోలీస్, ఆర్టీవో అధికారులు, సిబ్బంది ఉన్నారు.













