Loading

***రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా ఐదున్నర ఎకరాల స్థలంలో రూ.16.92 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపన…

న్యూస్ 24అవర్స్ టివి-కోదాడ ప్రతినిధి, 11 జులై 2026: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా, రోల్ మోడల్ గా, ఎయిర్ పోర్ట్ ను తలపించేలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి లు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బస్ డిపో సమీపంలో ఐదున్నర ఎకరాల స్థలంలో రూ.16.92 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసేలా రూపుదిద్దుకోనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు,కండక్టర్లు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రజలు సైతం ఆర్టీసీని తమ సొంత సంస్థగా భావించి ఆదరించాలని, ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కృషితో చిరస్థాయిలో గుర్తుండేలా నూతన బస్టాండ్ కు కృషి చేశారని అన్నారు. కోదాడ బస్ డిపో పరిధిలో 700 బస్సులు రోజుకు 30 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది ప్రయాణికులలో 30 లక్షల మంది రూ. 11,400 కోట్ల విలువైన మహిళలు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. అలాగే దేశంలోనే మొదటిసారిగా మహిళా సమాఖ్యలకు బస్సులు ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నామన్నారు.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు రవాణా శాఖను సమర్థవంతంగా నడిపిస్తూ ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నట్లు కొనియాడారు. రాష్ట్రంలోనే ఎక్కడా ఇవ్వని నిధులను కోదాడ బస్టాండ్ కు ఇచ్చారని అన్నారు. మూడున్నర దశాబ్దాల కోదాడ నియోజకవర్గంలో తన అనుబంధం బలమైనదని వందల కోట్ల నిధులను వెచ్చించి నియోజకవర్గానికి తాగు సాగునీరు, వంద పడకల ఆసుపత్రి, జవహర్ నవోదయ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, కొన్ని వేల ఎకరాలు నీరు అందించడానికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలంగాణకు ముఖద్వారం అయిన కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొన సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని నిధులను కోదాడ బస్టాండ్ కు ఇచ్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో కోదాడ బస్టాండ్ ను ఆధునిక ప్లాట్ ఫామ్ లతో ఎయిర్ పోర్ట్ ను తలపించేలా ఉంటుందని అన్ని వర్గాల ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు నిర్మాణం జరుగుతుందన్నారు.

అనంతరం కోదాడ నుంచి వయా నరసింహుల గూడెం, మోతే ప్రయాణించే బస్సును వారు జెండా ఊపి ప్రారంభించి బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ తిరుపతమ్మ, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *