***నిజజీవితంలో మాత్రం వీరు హీరోలు కాలేరు…

1993 నవంబర్ 15వ తేదీన ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక అద్భుతం జరిగింది. గాల్లో ఎగురుతున్న ఒక భారీ ఎయిర్‌బస్ విమానం ఇంధనం అయిపోయి నేలకూలింది. ఆ ఫ్లైట్‌లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, విజయశాంతి, అల్లు రామలింగయ్య, సుధాకర్, హీరోయిన్ మాలాశ్రీ ఉన్నారు. వీళ్ళే కాకుండా బాపు, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు లాంటి దిగ్గజ దర్శకులు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కేఎస్ శేఖర్ బాబు, కాస్ట్యూమ్ కృష్ణ సహా పలువురు డ్యాన్స్, ఫైట్ మాస్టర్లు ఇలా దాదాపు 60 మందికి పైగా సినీ ప్రముఖులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయానికి వస్తే.. ఉదయం 7 గంటల ప్రాంతంలో విమానం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అయితే దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రన్‌వే ఏమాత్రం కనిపించలేదు. దాంతో పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయకుండా తిరిగి మద్రాస్‌కు మళ్లించాలని నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో విమానంలో ఒక సాంకేతిక లోపం టెక్నికల్‌గా చెప్పాలంటే ఫ్లాప్ జామ్ తలెత్తింది. దీనివల్ల విమానాన్ని ఎక్కువ ఎత్తులో, స్పీడ్‌గా నడపలేని పరిస్థితి ఏర్పడింది. తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల విమానంలో ఇంధనం వేగంగా ఖర్చయిపోయింది. మద్రాస్ చేరేలోపే ఇంధనం పూర్తిగా అయిపోతుండటంతో, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను సంప్రదించారు. కానీ అప్పటికే విమానంలో ఉన్న ఇంధనంతో కనీసం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను కూడా చేరుకునే పరిస్థితి లేకపోయింది. క్షణక్షణం ఉత్కంఠ.. విమానం ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం. పైలట్ భల్లా తన చాకచక్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు 14 నాటికల్ మైళ్ల దూరంలో శ్రీకాళహస్తి సమీపంలోని గుండ్లపల్లె అనే గ్రామంలోని ఒక ఎండిపోయిన చెరువు, వ్యవసాయ పొలాల్లో విమానాన్ని ఎమర్జెన్సీ బెల్లీ ల్యాండింగ్ అంటే చక్రాలు లేకుండా విమానం పొట్టభాగంతో ల్యాండ్ చేయడం అన్నమాట.. పైలెట్ అదే చేశాడు. ఆ బురద పొలాల్లో విమానం దాదాపు అరకిలోమీటరు మేర రాసుకుంటూ వెళ్లి.. ఒక పెద్ద శబ్దంతో ఆగిపోయింది. అదృష్టవశాత్తూ విమానానికి ఎలాంటి మంటలు అంటుకోలేదు. భారీ శబ్దం రావడంతో సమీప గ్రామస్తులు, అప్పటి గుండ్లపల్లె సర్పంచ్ దేశిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు. విమానం ఎమర్జెన్సీ స్లైడ్స్ ద్వారా ప్రయాణికులందరూ కిందకు దిగారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో వణికిపోతున్న సినీ ప్రముఖులకు గ్రామస్తులు మజ్జిగ, నీళ్లు ఇచ్చి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో తమ ప్రాణాలు కాపాడిన ఆ ఊరి రుణం తీర్చుకోవడానికి అక్కడ ఒక ఆసుపత్రి కట్టిస్తామని అప్పట్లో సినీ ప్రముఖులు హామీ ఇచ్చారని, ఇప్పటికి సుమారుగా 23 సంవత్సరాలు గడిచిపోయాయి కానీ అది ఇంకా నెరవేరలేదని, అప్పడు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి సినీ రంగాన్ని ఏలుతున్న బాలకృష్ణ, చీరంజీవి, వెంకటేష్, విజయశాంతి లు ఇకనైనా ఇక్కడ ఆసుపత్రి నిర్మించాలని ఇప్పటికీ అప్పుడప్పుడు గుసగుసలు వస్తుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *