పోలీస్ శాఖలో భారీ అవినీతి, 15 మంది సిబ్బంది సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా ఎస్పీ. అవినీతి గుట్టు విప్పిన ‘హోంగార్డు’ జీతం. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో ఒక అవినీతి తిమింగలం చేసిన పని జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయం (DPO)లో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలపై విచారణ పూర్తి చేసిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రధాన నిందితుడితో సహా మొత్తం 16 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
రూ. 37 లక్షల నిధుల మళ్లింపు
అన్నమయ్య జిల్లా ఏర్పడిన 2022 సంవత్సరం నుంచి రాయచోటి లోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జయ కుమార్ రెడ్డి ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారి. సాటి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన అతను, వారి జీతాల పైనే కన్నేశాడు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను ఆసరాగా చేసుకుని, ఏకంగా రూ. 37 లక్షల ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించాడు.
అవినీతి గుట్టు విప్పిన ‘హోంగార్డు’ జీతం: తనకు అనుకూలంగా ఉండే కొంతమంది సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్న జయ కుమార్ రెడ్డి, కమిషన్ల కోసం ఇతరుల జీతాలను వీరికి మళ్లించేవాడు. అయితే, ఈ పాపం పండే రోజు రానే వచ్చింది. గతంలో మృతి చెందిన ఓ హోంగార్డు పేరుతో నిరంతరాయంగా జీతం జమ చేస్తూ వస్తుండటంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. అంతర్గత తనిఖీల్లో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సీరియస్ అయ్యారు. అదనపు ఎస్పీ వెంకటాద్రిని విచారణాధికారిగా నియమించి పూర్తి స్థాయి విచారణ జరిపించారు. ఆధారాలు దొరకడంతో రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేసి, కింది వారిని సస్పెండ్ చేశారు:
A1 జయ కుమార్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ (ప్రధాన నిందితుడు)
A2 సురేష్ బాబు సీనియర్ అసిస్టెంట్
A3 హరిబాబు హెడ్ కానిస్టేబుల్
A4 రాజేష్ బాబు హెడ్ కానిస్టేబుల్
A5 శ్రీరాములు కానిస్టేబుల్
A6 రాఘవేంద్ర కానిస్టేబుల్
A7 నాగరాజ రెడ్డి కానిస్టేబుల్
A8 మస్తాన్ ప్రసాద్ కానిస్టేబుల్
A9 మోహన్ కుమార్ కానిస్టేబుల్
A10 కె. రమేష్ కుమార్ కానిస్టేబుల్
A11 సి. జయచంద్ర కానిస్టేబుల్
A12 సి. విజయ్ కుమార్ కానిస్టేబుల్
A13 ఆర్. సుబ్బయ్య కానిస్టేబుల్
A14 కె. వెంకట సిద్ధులు కానిస్టేబుల్
A15 వి. శ్రీనివాసులు కానిస్టేబుల్
సొంత శాఖలోనే అవినీతికి పాల్పడి, 15 మంది జీవితాలతో ఆడుకున్న జయ కుమార్ రెడ్డి చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదన్న ఎస్పీ. ఈ చర్యల ద్వారా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.












