***ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, జిల్లా కలెక్టర్…

సూర్యాపేట ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-12.03.2026: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా స్థానిక రవి ఫంక్షన్ హాల్ లో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ లు, ఇతర ప్రజా ప్రతినిధులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్.పి నరసింహ, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి నలమాధ ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ప్రజల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారు లకు అవి చేరేలా చూడాలని తెలిపారు.
ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై నేడు ఉందని అన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందని అన్నారు. పాలక వర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని, మార్చి 31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయని మంత్రి తెలిపారు.
ప్రతి గ్రామానికి జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు నిధులు విడుదల అయ్యాయని, ఈ నిధులు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని అన్నారు. చట్ట పరిధిలో నిధులను సద్వినియోగం చేయాలని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కాపలాదారుగా ఉండాలని తెలిపారు. పేద ప్రజలకు నిరంతరం మంచి చేసే విధంగా, రాజకీయాలక తీతంగా ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం గెలిచిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. ప్రతి ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా తన సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్య ఏ గ్రామంలో లేకుండా ఉండే విధంగా అధికారులు, నూతన ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీకి విడుదలైన నిధులు సద్వినియోగం అయ్యే విధంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలలో సమస్యలు కేవలం డబ్బుతో మాత్రమే పరిష్కారం కావని అన్నారు. సిసి రోడ్ల, డ్రైయిన్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టడం చాలా కీలకమని అన్నారు. గ్రామాలలో నిర్మించే నూతన రోడ్లు, డ్రైయిన్ సమయంలో అధికారులు ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ అధికంగా ఉండాలని, ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు.
తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్లో దేశంలో ఎక్కడ లేని విధంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండినదని, రైతుల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఒక ఖరీఫ్ పంటకే రైతులకు 20 వేల కోట్లు చెల్లించినామని, కొనుగోలు బోనస్ కింద 40 వేల కోట్లు చెల్లించినామని, ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ తన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయుటకు లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్రంలో కొత్తగా 47, 750 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డు నిరంతర ప్రక్రియని ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హతను బట్టి తెల్ల కార్డుమంజూరు చేస్తామని, సన్న బియ్యం కోసం ఒక సంవత్సరానికి 14 వేల కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని, దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తీసుకురావడానికి పనులు జరుగుతున్నవని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ప్రజలతో నిరంతరం ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటూ సమయస్ఫూర్తితో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. నేటి శిక్షణ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు సరిగ్గా వినియోగించు కోవాలని సూచించారు.


జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం కీలకమని తెలిపారు. 99 రోజుల కార్యక్రమం పై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేడు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా ప్రతినిధులకు గుర్తింపు కార్డులు, 99 రోజుల కార్యక్రమంపై మెటీరియల్ అందించామని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు 10 థీమ్స్ లో చేపట్టే ప్రోగ్రాంలలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన వివిధ సంక్షేమ, అభివృద్ధి పనుల అమలు గురించి అవగాహన, పంచాయతీ, మున్సిపల్ చట్టాల గురించి కూడా శిక్షణ అందిస్తామని కలెక్టర్ తెలిపారు. నేటి శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటారాక్టివ్ సెషన్ లాగా నేటి శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పట్టణ ప్రాంత ప్రజా ప్రతినిధులకు విధి నిర్వహణ, ప్రభుత్వ ముఖ్యమైన కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు ఉన్న నిబంధనలు విధివిధానాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తమ గ్రామం, మున్సిపల్ వార్డు/డివిజన్ పరిధిలో నిబంధనల ప్రకారం బాగా పనిచేసి జాతీయస్థాయిలో ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు,జెడ్పీ సిఈఓ శిరీష, డిపిఓ యాదగిరి, సిపిఓ కిషన్, డివైఎస్ఓ వెంకట రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వార్డు కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.













