న్యూస్ 24అవర్స్ టివి, వండర్స్-10.03.2026:భారతదేశం లో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. కొన్ని ఆలయాలకు అద్భుతమైన కథలు ఉంటాయి. కానీ సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలు కొన్ని ఆలయాల్లో దాగి ఉన్నాయి. మనం దేవుడిని పూజిస్తాం. గుడికి వెళ్లి దండం పెట్టుకుంటాం. కానీ దేవుడు నిజంగా వచ్చి మన కళ్ళ ముందే తిరిగితే ఎలా ఉంటుంది? అలాంటి అద్భుతం కలియుగంలో జరుగుతుందా? అవును, జరుగుతోంది అని భక్తులు నమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ఉన్న బృందావనంలో ఒక ప్రదేశం ఉంది. అదే ‘నిధివన్’. అక్కడ ప్రతి రాత్రి సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాధతో కలిసి నాట్యం చేస్తాడట. సూర్యాస్తమయం అయ్యాక అక్కడ మనుషులు కాదు కదా.. పక్షులు, జంతువులు కూడా ఉండవు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసి అక్కడ రాత్రిపూట ఉండిపోతే.. తెల్లారేసరికి వాళ్ళు ప్రాణాలతో ఉండరు. ఒకవేళ బతికినా.. వాళ్ళకు పిచ్చి పడుతుంది. అసలు ఆ ఆలయం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ తలుపులు మూసాక లోపల ఏం జరుగుతుంది? ఈరోజు మన వీడియోలో ఈ మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో బృందావనం ఉంది. కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశం ఇది. ఇక్కడి ప్రతి అణువులో కృష్ణుడు ఉంటాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న ‘నిధివన్’ అనే ప్రదేశం చాలా ప్రత్యేకం. దీన్నే ‘నిధివన రాజ్’ అని కూడా పిలుస్తారు. చూడ్డానికి ఇది ఒక చిన్న అడవిలా ఉంటుంది. కానీ ఇది సామాన్యుల అడవి కాదు. ఇది కృష్ణుడు తన గోపికలతో రాసలీలలు జరిపే పవిత్ర స్థలం. సాధారణంగా చెట్లు ఆకాశం వైపు నిటారుగా పెరుగుతాయి. కొమ్మలు పైకి వెళ్తాయి. కానీ నిధివన్లో ఉన్న చెట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు కాండం వంకరటింకరగా ఉంటుంది. కొమ్మలు కిందికి వాలిపోయి, ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. ఇక్కడ ఏ చెట్టూ ఒంటరిగా ఉండదు. అన్నీ జంటగానే ఉంటాయి.
భక్తుల నమ్మకం ప్రకారం.. ఇవి కేవలం చెట్లు కాదు. ఇవి గోపికలు. రాత్రి కాగానే ఈ చెట్లన్నీ గోపికలుగా మారిపోతాయి. కృష్ణుడు రాగానే ఆయన చుట్టూ చేరి నాట్యం చేస్తాయి. అందుకే ఈ చెట్లు ఒకదానికొకటి పెనవేసుకుని, కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తాయి. ఈ వనంలో తులసి మొక్కలు కూడా జంటగానే పెరుగుతాయి. ఎవరైనా ఇక్కడి నుంచి ఒక చిన్న కొమ్మను గానీ, ఆకును గానీ ఇంటికి తీసుకెళ్లే సాహసం చేయరు. అలా చేస్తే వాళ్ళ కుటుంబానికి కీడు జరుగుతుందని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.
నిధివన్ మిస్టరీ అంతా రాత్రివేళలోనే మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలు దాటగానే ఆలయ పూజారులు అక్కడి భక్తులందరినీ బయటకు పంపించేస్తారు. ప్రధాన ద్వారాన్ని గట్టిగా లాక్ చేస్తారు. ఆ సమయంలో అక్కడ ఒక్క మనిషి కూడా ఉండకూడదు. ఆఖరికి ఆలయ పూజారులు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతారు. కేవలం మనుషులే కాదు.. పగలు అంతా అక్కడ సందడి చేసే కోతులు, పక్షులు, ఉడతలు కూడా సాయంత్రం కాగానే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతాయి. రాత్రి వేళ ఆ వనం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎంత నిశ్శబ్దం అంటే.. చిన్న ఆకు రాలిన శబ్దం కూడా స్పష్టంగా వినిపించేంత! రాత్రి వేళ ఇక్కడ శ్రీకృష్ణుడు వస్తాడనీ, రాధతో కలిసి రాసలీలలు ఆడతాడనీ పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆ అద్భుతాన్ని చూసే అర్హత ఎవరికీ లేదు. అందుకే అక్కడ ఎవరూ ఉండకూడదు అనే నియమం తరతరాలుగా వస్తోంది.
ఇక నిధివన్ లోపల ‘రంగ మహల్’ అనే ఒక చిన్న ఆలయం ఉంది. దీన్ని రాధాకృష్ణుల విశ్రాంతి గది అని పిలుస్తారు. ఇక్కడే అసలైన మిస్టరీ దాగి ఉంది. ప్రతి రోజు సాయంత్రం, ఆలయం మూసే ముందు పూజారులు ఇక్కడ ఒక ప్రత్యేక సేవ చేస్తారు. గదిలో ఒక అందమైన మంచాన్ని సిద్ధం చేస్తారు. దాని మీద మెత్తటి పరుపు, శుభ్రమైన దుప్పట్లు వేస్తారు. పక్కనే ఒక వెండి గ్లాసు నిండా మంచి నీళ్ళు పెడతారు. రాధాదేవి అలంకరణ కోసం అద్దం, దువ్వెన, గాజులు, కుంకుమ, చీర పెడతారు. కృష్ణుడి కోసం తమలపాకులు (పాన్), లడ్డూలు, పళ్ళు పెడతారు. పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు కూడా పెడతారు. ఇవన్నీ పెట్టి పూజారులు తలుపులకు తాళం వేసి వెళ్లిపోతారు. ఆ గదికి కిటికీలు కూడా ఉండవు. గాలి కూడా చొరబడలేని విధంగా సీల్ చేస్తారు.
అసలు అద్భుతం మరుసటి రోజు ఉదయం జరుగుతుంది. ఉదయం 5 గంటలకు పూజారులు వచ్చి తలుపులు తెరుస్తారు. లోపల చూస్తే.. మంచం మీద వేసిన దుప్పట్లు నలిగిపోయి ఉంటాయి. ఎవరో రాత్రంతా ఆ మంచం మీద పడుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గ్లాసులో నీళ్ళు సగం ఖాళీ అయి ఉంటాయి. పెట్టిన స్వీట్లు, పాన్ ఎవరో తిన్నట్లుగా ఉంటాయి. వేప పుల్లలు నమిలి పడేసినట్లుగా ఉంటాయి. రాధాదేవి అలంకరణ వస్తువులు వాడినట్లుగా చిందరవందరగా పడి ఉంటాయి. ఇది ఒక్క రోజు జరిగేది కాదు. ప్రతి రోజూ జరుగుతుంది. గదికి తాళం వేసి ఉంటుంది. లోపలికి ఎవరూ వెళ్లలేరు. సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా ఎవరూ సాహసించరు. మరి లోపల ఇవన్నీ ఎవరు వాడుతున్నారు? కృష్ణుడే వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడని ఇక్కడి పూజారులు, భక్తులు బల్లగుద్ది మరీ చెబుతారు.
దొంగచాటుగా చూస్తే ఏమవుతుంది? మీకు ఒక సందేహం రావచ్చు. “నిజంగా కృష్ణుడు వస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఎవరైనా రాత్రిపూట అక్కడ దాక్కోవచ్చు కదా?” అని. చాలా మంది ఇలాంటి ప్రయత్నాలే చేశారు. కానీ ఫలితం చాలా భయంకరంగా వచ్చింది. గతంలో కొంతమంది సైన్స్ స్టూడెంట్స్, జర్నలిస్టులు, హేతువాదులు ఈ మిస్టరీని ఛేదించాలని రాత్రిపూట చెట్ల వెనుక దాక్కున్నారు. కానీ మరుసటి రోజు ఉదయం వాళ్ళు అచేతన స్థితిలో కనిపించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. బతికి ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారిపోయారు. వాళ్ళు ఏం చూశారు? అక్కడ ఏం జరిగింది? అని అడిగితే చెప్పడానికి వాళ్ళ నోటి నుంచి మాట రాదు. వాళ్ళు మూగవాళ్ళుగా, చెవిటివాళ్ళుగా మారిపోతారు. మానసిక స్థితి కోల్పోయి, తమ పేరు కూడా మర్చిపోయే స్థితికి చేరుకుంటారు.
ఒక కథనం ప్రకారం.. జైపూర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు రాత్రిపూట అక్కడే దాక్కున్నాడు. ఉదయం అతను స్పృహ కోల్పోయి కనిపించాడు. తెలివి వచ్చాక ఏమీ మాట్లాడలేకపోయాడు. కొద్ది రోజులకే మరణించాడు. అందుకే ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్స్ పైన ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. పోలీసులు, సెక్యూరిటీ గార్డులు కూడా సాయంత్రం కాగానే గేట్లు మూసివేసి దూరంగా వెళ్లిపోతారు. కిటికీలు ఉన్న ఇళ్లు ఆ చుట్టుపక్కల ఉన్నాయి. కానీ రాత్రి కాగానే వాళ్ళు కిటికీలు మూసేస్తారు. ఎవరూ అటు వైపు కనీసం తొంగి కూడా చూడరు. చూస్తే కళ్ళు పోతాయని వాళ్ళ భయం.
ఈ నిధివన్ చరిత్ర స్వామి హరిదాస్ తో ముడిపడి ఉంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, కృష్ణ భక్తుడు. ప్రసిద్ధ గాయకుడు తాన్ సేన్ కు గురువు కూడా ఆయనే. స్వామి హరిదాస్ తన సంగీతంతో కృష్ణుడిని మెప్పించేవాడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణుడు, ఈ నిధివన్లోనే ఆయనకు దర్శనం ఇచ్చాడని చెబుతారు. ఆ విగ్రహమే ఇప్పుడు మనం చూస్తున్న ‘బంకే బిహారీ’ విగ్రహం. స్వామి హరిదాస్ సమాధి కూడా ఇదే వనంలో ఉంది. ఆయన తంబూరా ఇప్పటికీ అక్కడ ఉందని అంటారు. రాత్రి వేళల్లో ఈ వనం నుంచి గజ్జల శబ్దాలు, వేణుగానం వినిపిస్తాయని స్థానికులు చెబుతారు. ఆ సంగీతం వినిపించినప్పుడు అది దైవ సంబంధమైనదని భావించి ప్రజలు చెవులు మూసుకుని పడుకుంటారు తప్ప, బయటకు వచ్చి చూసే ప్రయత్నం చేయరు.
దీనిపై సైన్స్ ఏం చెబుతోంది? ఇదంతా మూఢనమ్మకం అని కొందరు కొట్టిపారేస్తారు. రాత్రిపూట ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల, లేదా అక్కడ విడుదలయ్యే కొన్ని రకాల వాయువుల వల్ల మనుషులు స్పృహ కోల్పోవచ్చని సైన్స్ పరంగా వాదించేవారు ఉన్నారు. ఆ చెట్ల ఆకారం వెనుక కూడా ఏదైనా బొటానికల్ కారణం ఉండొచ్చని అంటారు. అయితే.. ప్రసాదం ఎవరు తింటున్నారు? మంచం ఎవరు వాడుతున్నారు? అనే ప్రశ్నలకు మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఆలయ పూజారులు మాత్రం ఇది కచ్చితంగా దైవలీలే అని అంటారు. దేవుడు ఉన్నాడనే నమ్మకానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తారు. కోతులు కూడా సాయంత్రం అయితే వెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. మామూలుగా జంతువులకు ఇలాంటి భయాలు ఉండవు కదా? కానీ నిధివన్లో పక్షులు, జంతువులు కూడా ఒక నియమాన్ని పాటిస్తున్నట్లుగా వెళ్లిపోవడం ఈ మిస్టరీకి బలం చేకూరుస్తోంది


