న్యూస్ 24అవర్స్ టివి, ఆర్టికల్-12.03.2026: తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కావాల్సిన సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ఆకునూరి మురళీ కమీషనర్ గా నియమించబడిన తెలంగాణ విద్యా కమిషన్ ఉపాధ్యాయ వృత్తిని వేతనంతో వెలకట్టడం అత్యంత దురదృష్టకరం, ఇది ఉపాధ్యాయ వృత్తికి అవమానకరమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) మరియు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) రాష్ట్ర పూర్వ అధ్యక్షులు తీకుళ్ళ సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు ఇచ్చేది వేతనం కాదు—అది గౌరవభృతి. ఈ సృష్టిలో వెలకట్టలేని వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే.
అణగారిన వర్గాల పిల్లలకు విద్యాగంధం ప్రభుత్వ పాఠశాలల ద్వారానే అందుతుంది. ప్రస్తుతం ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పేద వర్గాలకు అనేక అంశాలలో తీవ్ర నష్టం కలిగించేలా ఉంది. ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించాలనే ప్రతిపాదన అత్యంత విచారకరం, కడుపు మండే విషయం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా అవుతుంది. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. అది ఈ విద్యా కమిషన్ పెద్దలకు కనిపించలేదా? ముఖ్యంగా, ఈయన గారు అక్కడే పనిచేసి వచ్చారు కదా!
జీతాలు ఎక్కువ ఇస్తున్నారన్నా, 30–40 సంవత్సరాలు యవ్వనం మొత్తం ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసి ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెందాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలనే ప్రతిపాదన మాత్రం ఈ కమిషన్ పెద్దలకు గుర్తుకురాలేదు.
ఈ కమిషన్లో తరగతి గది బోధనలో, విద్యారంగంలో విశేష అనుభవం ఉన్నవారు ఎవరున్నారో ప్రభుత్వం చెప్పాలి. విద్యారంగంలో అనుభవం లేని వ్యక్తులతో విద్యా రంగ మార్పులు, మానవ వనరుల నిర్మాణం ఎలా సాధ్యం? ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వపు పెద్ద తప్పిదం. దీన్ని బట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ పరం చేయాలనే కుట్ర జరుగుతోందని అనుమానం కలుగుతోంది.
ఇప్పటికే మేధావులు రాష్ట్రం, దేశం విడిచి వలస వెళ్తున్నారు. అనేక మంది విజ్ఞానవంతులు సాఫ్ట్వేర్, వైద్య, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్తున్నారు కానీ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ అమలు అయితే ప్రజ్ఞా పాఠవాలు ఉన్న మేధావులు ఉపాధ్యాయ వృత్తిలోకి రానే రారు. అంటే ప్రభుత్వమే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తోందా అన్న అనుమానం తప్పదు. దీని వల్ల అణగారిన వర్గాల పేద పిల్లలకు తీవ్ర నష్టం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. తద్వారా భవిష్యత్తులో దేశానికే నష్టం జరుగుతుంది. విద్యారంగాన్ని ఆదాయం–వ్యయాలతో ముడిపెట్టకూడదనే విషయం ఈ గొప్ప విద్యా కమిషన్ పెద్దలకు తెలియదా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మాది సంపన్న రాష్ట్రం అని అత్యధికంగా జీతాలు తీసుకుంటున్నారు. కొంతమంది మాజీ ప్రజా ప్రతినిధులు రెండు – మూడు పెన్షన్స్ తీసుకుంటున్నారు. మరి విద్యారంగంపై సరైన అవగాహన లేని ఈ విద్యా కమిషన్ ఈ విషయాన్ని కూడా తమ రిపోర్ట్లో చేర్చితే బాగుండేది.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం, పంచాయితీరాజ్, ఎయిడెడ్, కెజిబివి, మోడల్, రెసిడెన్సియల్,SC, ST, BC,మైనార్టీ గురుకులాల స్కూల్స్ , ప్రయివేట్ ఇలా అనేక రకాలుగా ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్న పి.ఎమ్.శ్రీ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చి ఒక్కోరకమైన శిక్షణలు, స్కూల్స్ ను ప్రారంభిస్తుంది. ఇప్పటికే ఉన్న స్కూల్స్ ను గాలికి వదిలేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం పబ్లిక్ స్కూల్స్ అంటుంది.మళ్ళీ మరొకాయన వచ్చి మరోటి అంటారు. దీనితో ఉపాధ్యాయులు బదనాం కావడం జరుగుతుంది. అందుకే పాఠశాల విద్యను రాజకీయాలకు సంబంధం లేని ఒకే స్వతంత్ర యాజమాన్యం కిందకు తీసుక రావాలి. నాణ్యమైన విద్యను అన్నికులాల వారికి ఒకే దగ్గర అందించాలి.
ప్రస్తుతం స్కాలర్షిప్లు పొందేది అత్యధికంగా గ్రామీణ పేద కుటుంబాల పిల్లలే. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లు సకాలంలో అందక వారి చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఈ రిపోర్ట్ అమలు అయితే స్కాలర్షిప్ లు రాక వీరి భవిష్యత్తు ఏమవుతుంది? ఇది కార్పొరేట్ విద్యా సంస్థలకే లాభం చేకూరుస్తుంది. పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తుంది.
ఒకటో తరగతి నుండే ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం ప్రారంభించాలని ఆకునూరి విద్యా కమీషన్ అనడం సరైంది కాదు. ఇది NEP 2020 ప్రతిపాదనకు వ్యతిరేకం. విద్యార్థి తన మాతృభాష/ ప్రాంతీయ భాషలో ఐదవ తరగతి వరకు తప్పనిసరిగా చదవాలని జాతీయ విద్యా విధానం సూచిస్తుంది. మాతృభాషను నేర్చుకోవడంవల్ల విద్యార్థిలో పఠన శక్తీ, సృజనాత్మకత పెరుగుతుంది అని ప్రపంచ సైకాలజిస్ట్ ల ప్రతిపాదన. దీనిని ఆధారం చేసుకునే ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని దేశ పార్లమెంట్ ఆమోదిచింది. దేశమంతా NEP 2020 అమలుకు శ్రీకారం చుట్టాయి. ఊరంత ఒకవైపు ఉలిపిరికట్ట ఒకవైపు అన్నచందంగా ఉంది ఆకునూరి కమీషన్ నివేదిక. త్రి భాష సూత్రం (తెలుగు, హిందీ, ఇంగ్లీష్) అంటూ తెలుగు/ఉర్దూ ప్రథమ భాషగా సూచించడంలోని అంతరార్థం ఆకునూరే వివరించాలి. ఇది (తెలంగాణ) తెలుగు ప్రాంతమా లేక (నిజాం) ఉర్దూ ప్రాంతమా అనే సందేహం కలుగుతుంది. ఇందులో ఏలిన వారి సైద్దాంతిక పాలసీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అదేంటంటే తెలుగంటే ఉర్దూ, ఉర్దూ అంటే తెలుగు అనీ ప్రతిపాదిస్తూ పాలకుల రాగానికి వంతపాడినట్లుంది ఆకునూరి సూచన. ఇప్పటికే తెలుగు భాషను పెద్ద మొత్తంగా ఇంగ్లీష్ మింగేసింది. మినుకు మినుకు మంటున్న తెలుగును అంతమొందిచాలని సమాంతరంగ ఉర్దును సూచించడం తెలుగు భాషను, తెలంగాణయాసను పాతాలానికి తొక్కేయడమే అన్నది వాస్తవం. ఈ తెలంగాణ విద్యా కమీషన్ భయంకరమైన ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. తెలంగాణలో మాతృభాష తెలుగును కనీసం ఐదవతరగతి వరకైన అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు పీజీ, బీఈడ్ తప్పనిసరి అని ప్రతిపాదించడం కూడా అనవసరం. పేద కుటుంబాల పిల్లలు ఎంతమంది పీజీ వరకు చదువగలరో ఆలోచించాలి. కలెక్టర్ కావడానికి డిగ్రీ సరిపోతుంది కానీ ప్రాథమిక ఉపాధ్యాయుడు కావాలంటే పీజీ కావాలంటారా? జీతం మాత్రం కలెక్టర్ కంటే తక్కువగా ఇవ్వాలంటారా? ఇది ఎక్కడి న్యాయం? ప్రాథమిక బోధనకు డిగ్రీ + TTC లేదా B.Ed సరిపోతుంది. పీజీలు అవసరం లేదు.
పన్నెండో తరగతిలో మాత్రమే బోర్డు పరీక్ష నిర్వహించడం సరైంది కాదు. పదో, పన్నెండో తరగతుల్లో తప్పనిసరిగా బోర్డు పరీక్షలు నిర్వహించినప్పుడే నాణ్యమైన విద్య సాధ్యం. లేకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో నిర్లిప్తత పెరుగుతుంది. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు 3–4 నెలలు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మళ్లీ పరీక్ష నిర్వహించి పదకొండో తరగతికి పంపాలి. పన్నెండో తరగతిలో ఒక్కసారే బోర్డు పరీక్ష అంటే అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యి కూలీలుగా మారే ప్రమాదం ఉంది. ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతారు.
కనీస ఉత్తీర్ణత శాతాన్ని 45% కు పెంచాలనడం కూడా అశాస్త్రీయం. ప్రస్తుతం ఉన్న 35% సరిపోతుంది. సరైన వసతులు కల్పించకుండా ఉత్తీర్ణత మార్కులు పెంచడం పేదలకు విద్య అందని ద్రాక్షే అవుతుంది. ఉపాధ్యాయుల నియామక విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. ఒక క్లర్క్గా చేరిన ఉద్యోగి ప్రమోషన్ ద్వారా కలెక్టర్ వరకు వెళ్లొచ్చు కానీ ఉపాధ్యాయుడు మాత్రం పై పోస్టుకు అర్హుడు కాదా? ఇది ఎక్కడి న్యాయం?.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోకుండా, విద్యారంగం లో నిష్ణాతులైన విద్యావేత్తలతో కొత్త కమిటీ ఏర్పాటు చేసి మళ్లీ అభిప్రాయాలు సేకరించాలని కోరుతున్నాను.












