సూర్యాపేట ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-05.04.2026: డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ సేవలు చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు అన్నారు. ఆదివారం డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ 119 జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండు వద్ద ఏర్పాటుచేసిన జయంతి ఉత్సవాలకు అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బస్టాండ్ కూడలిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి సభా వేదికపై ఏర్పాటుచేసిన ఫోటోకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మున్సిపల్ చైర్మన్, అడిషనల్ ఎస్పీ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని బాబు జగ్జీవన్ రామ్ విద్య అభ్యాసం నుండి కుల వివక్షత ఎదుర్కొన్నారని, వివక్షత నుండి పోరాట ప్రతిమ మొదలు పెట్టారని, మదన మోహన మాలవ్య బెనారస్ యూనివర్సిటీ లో ఇంటర్మీడియట్, బెంగాల్లో డిగ్రీ చదివారని మొదట స్వాతంత్ర ఉద్యమం బెంగాల్ నుండి ప్రారంభమైనదని, బాబు జగ్జీవన్ రామ్ బెంగాల్ లో చదువుకోవడం వలన అక్కడి ఉద్యమాలలో దళితులను, అన్నగారిన ఆట్టడుగు వర్గాల వారిని ఏకం చేసి అనేక ఉద్యమాలలో పాల్గొని వారి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, 30 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో అనేక కీలకమైన పదవులు కార్మిక, వ్యవసాయ, రైల్వే, రక్షణ శాఖలు అనుభవించి ఆ పదవులకు వన్నె తీసుకొచ్చారని కార్మికుల కోసం అనేక చట్టాలు తీసుకువచ్చి ప్రజలకు మేలు చేశారని, ఇండోపాక్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టి యుద్ధాన్ని పటిష్టంగా ఎదుర్కొన్నారని, సమాజంలో అట్టడుగు బలహీన వర్గాల వ్యత్యాసం ఉండకూడదని, సమ సమాజ స్థాపన జరగాలని, అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారని వారి యొక్క ఆశయాలను, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అయన అన్నారు.

మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ మొదటిసారి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నానని జగ్జీవన్ రామ్ చాలా గొప్ప వ్యక్తి అని, సుదీర్ఘకాలం బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, దళితుల హక్కుల కొరకు అనేక పోరాటాలు చేశారని, సుదీర్ఘకాలం మంత్రి పదవిలో పనిచేసి కార్మికుల కోసం అనేక చట్టాలు తీసుకువచ్చారని అన్నారు.

అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ మహనీయులని, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని 50 సంవత్సరాలు ప్రజాజీవితంలో ఉండి స్వప్రయోజనాల కోసం పదవులు అనుభవించలేదని, దేశానికి సేవ చేసిన గొప్ప మహానీయుడని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గం నుండి పదవులు మొదలుకొని తన జీవిత చర్మాంకం వరకు కూడ దేశానికి సేవ చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వినారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీఉద్దీన్, తాసిల్దార్ కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ నాయకులు బొల్లెద్దు వీరయ్య, చింతలపాటి చిన్న శ్రీరాములు, జీడి బిక్షం, ములకలపల్లి రాములు, నెమ్మది బిక్షం, నెమ్మది వెంకటేశ్వర్లు, చల్లమాల నరసింహారావు, డాక్టర్ రామ్మూర్తి, టిఎన్జీవోస్ జిల్లా ప్రెసిడెంట్ జానీ మియా, సెక్రటరీ దున్న శ్యామ్, గోపి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వివిధ సంఘాల నాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












