లోకమంతా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటున్న వేళ 22వ రోజుకు చేరుకున్న తమ ఆకలి దీక్షలతో స్విమ్స్ ఆసుపత్రిలో సేవలందిస్తున్న 800 మంది కార్మికులు మాత్రం రోడ్డుపై ఉండటం చాలా బాధాకరమని సిఐటియు తిరుపతి స్విమ్స్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది పండుగ రోజున కూడా తమ దీక్షా శిబిరం వద్దే పూజలు నిర్వహించుకోవాల్సి వచ్చిన పరిస్థితి, యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని సిఐటియు పేర్కొంది.
ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు కే. వేణుగోపాల్ మాట్లాడుతూ, కొత్త సంవత్సరాన్ని స్వాగతించే రోజున ప్రజల ఇళ్లలో సంతోషం నిండిపోతుంటే, స్విమ్స్ కార్మికుల ఇళ్లలో మాత్రం ఆకలి, ఆందోళన మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా, కార్మికులను చర్చలకు పిలవకుండా యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కేవలం రూ.13,500 ల తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న కార్మికులు పండుగ రోజున కూడా తమ పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో ప్రాణాలకు పోరాడుతున్న రోగులకు సేవలు అందించే వార్డ్ బాయ్లు, పేషెంట్ కేర్ అసిస్టెంట్లను ‘శానిటేషన్ కార్మికులు’గా తక్కువ చేసి చూడటం అమానుషమని అన్నారు.
ఇతర టీటీడీ అనుబంధ సంస్థల్లో ఉన్నట్లే గౌరవం, వేతనాలు స్విమ్స్ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారుల మొండి వైఖరి కారణంగా వందలాది కుటుంబాలు పండుగ రోజున కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బెదిరింపులు, ఒత్తిళ్లతో ఈ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేస్తూ, వెంటనే హోదా మార్పు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి గోపి, సూరి, వెంకటేష్, బాలకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది కార్మికులు దీక్షా శిబిరం వద్దే ఉగాది పచ్చడిని స్వీకరించి, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపబోమని ప్రతిజ్ఞ చేశారు.












