![]()
యాంత్రికంగా రిమాండ్ విధించడం సరి కాదు…
దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటించాలి…
జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం…
సర్క్యులర్ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)…
మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పక పాటించాలి…
చట్టాన్ని ఏ మాత్రం ఉల్లంఘించినా ఉపేక్షించబోము…
వారు కోర్టు థిక్కారం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది…
ఇంకా వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుంది…
సర్క్యులర్లో రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన హెచ్చరిక…

వీర వెంకట నాగప్రసాద్-న్యాయ పరిరక్షణ సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు & RTI ACT మీడియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్.
న్యూస్ 24అవర్స్ టివి-చట్టం-న్యాయం, 31 ఆగస్టు 2026: రాష్ట్రంలో ఇటీవల సోషల్ మీడియా పోస్ట్లు, కామెంట్స్కు సంబంధించి నమోదైన కేసులు, అరెస్టులు, రిమాండ్స్కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సర్క్యులర్ (నెం:8 ఆఫ్ 2025) జారీ చేసింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదా కామెంట్కు సంబంధించి పలు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి, నిందితులకు యాంత్రికంగా రిమాండ్ వి«ధించకుండా, కచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలంటూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) సర్క్యులర్ (ఆర్ఓసీ నెం:99) జారీ చేశారు.
సోషల్ మీడియా పోస్ట్ల కేసుల విచారణలో.. అర్నేష్కుమార్ వర్సెస్ బీహార్ (జూలై 2, 2014), ఇమ్రాన్ ప్రతాప్ గధి వర్సెస్ గుజరాత్ (మార్చి 28, 2025) కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్రంలో కూడా ఆ ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో కూడా చాలా యాంత్రికంగా పలువురు మెజిస్ట్రేట్లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది.
సోషల్ మీడియా పోస్ట్లు, కామెంట్స్కు సంబంధించిన కేసుల్లో ఆదేశాలు జారీ చేసే ముందు మెజిస్ట్రేట్లు ఎఫ్ఐఆర్ను సమగ్రంగా పరిశీలించాలని, కేసు నమోదు చేసే ముందు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారా? లేదా? అన్న అంశాన్ని చూడాలని హైకోర్టు నిర్దేశించింది. కాగా, ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పోలీసులు ముందుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకోవడంతో పాటు, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 (3) ప్రకారం ప్రాథమికంగా దర్యాప్తు చేయాలని, దాన్ని 14 రోజల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైకోర్టు గుర్తు చేసింది.
అందుకే సోషల్ మీడియా కేసుల విచారణలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలని, నిందితుడు పదే పదే ఆ పని చేశాడా? బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేస్తాడా? నిందితుణ్ని ఇంకా విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్నది సమగ్రంగా, ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకోవాలని హైకోర్టు ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది.
ఇవేవీ చేయకుండా, ఏకపక్షంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో మెజిస్ట్రేట్లు ఏ మాత్రం చట్టాన్ని ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని, వారు కోర్టు థిక్కారం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇంకా వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.