
***కేవలం ప్రొటీన్ పౌడర్లపైనే ఆధారపడకుండా పప్పులు, పెరుగు, గుడ్లు, చేపల వంటి సహజమైన ఆహారాల ద్వారా సమతులంగా ప్రొటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు…

న్యూస్ 24అవర్స్ టివి-ఫుడ్ & హెల్త్, 11 జులై 2026: జిమ్కు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఇటీవలి కాలంలో అధికంగా ప్రొటీన్ తీసుకుంటున్నారు. అయితే అవసరానికి మించి ప్రొటీన్ తీసుకోవడం వల్ల కాలేయంపై అదనపు భారం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి ప్రొటీన్ అవసరమే అయినా అతిగా తీసుకుంటే దీర్ఘకాలంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఫ్యాటీ లివర్ లేదా ఇతర జీవక్రియ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
లివర్పై ఒత్తిడి పెరిగితే కొన్ని సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ఎప్పుడూ అలసటగా ఉండటం, ఏకాగ్రత తగ్గడం, చిరాకు పెరగడం, కడుపు ఉబ్బరం లేదా కుడివైపు పైభాగంలో అసౌకర్యం, మూత్రం ముదురు రంగులో లేదా నురుగు రావడం, రక్తంలో చక్కెర లేదా కొవ్వు స్థాయులు పెరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. ఇవి లివర్ ఒత్తిడికి సంకేతాలు కావచ్చని పేర్కొంటున్నారు. ఇటీవల వెలువడిన అధ్యయనాల ప్రకారం భారత్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. అందుకే ప్రొటీన్ను అవసరమైన మోతాదులోనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఒక్కో కిలో శరీర బరువుకు రోజుకు 0.8 నుంచి 1 గ్రాము ప్రొటీన్ సరిపోతుందని చెబుతున్నారు. కేవలం ప్రొటీన్ పౌడర్లపైనే ఆధారపడకుండా పప్పులు, పెరుగు, గుడ్లు, చేపల వంటి సహజమైన ఆహారాల ద్వారా సమతులంగా ప్రొటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.