
సిరికొండ రామకృష్ణ ఫిర్యాదులతో గ్రామానికి చేరుకున్న ఫిషరీస్ అభివృద్ధి అధికారి…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 09 జులై 2026: నేరేడుచర్ల మండలం లోని పెంచికల్ దిన్నె గ్రామ చెరువు సొసైటీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలు, అక్రమ సభ్యత్వాలు మరియు మత్స్య సహకార సంఘం నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై గత మూడు సంవత్సరాల క్రితం నుంచి ఆర్టీఐ సామాజిక కార్యకర్త, చైతన్యవంతుడు, విద్యావంతుడు, బహుజన మేధావి సిరికొండ రామకృష్ణ పలుమార్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి మరియు తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త కి మరియు సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీసం మారయ్య పెంచికల్ దిన్నె గ్రామానికి చేరుకుని క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. విచారణ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మత్స్య సహకార సంఘానికి చెందిన పాత సభ్యులు, కొత్త సభ్యులు, గ్రామస్థుల అభిప్రాయాలను అధికారి స్వయంగా నమోదు చేసుకున్నారు. అక్రమ సభ్యత్వాలు, సంఘ నిర్వహణలో జరిగిన అవకతవకలు, సభ్యులు లేవనెత్తిన ఇతర అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ విచారణలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలను సమగ్ర నివేదిక రూపంలో జిల్లా అధికారులకు సమర్పిస్తామని, అనంతరం జిల్లా అధికారులు నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకుని చర్యలు చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన మత్స్య సహకార సంఘం పాత సభ్యులు, కొత్త సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.