
పాటల పెద్దన్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంస్మరణ సభను జయప్రదం చేయాలన్న సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య…

న్యూస్ 24అవర్స్ టివి-ఖమ్మం ప్రతినిధి, 08 జులై 2026: ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన విప్లవ గాయకుడు, పాటల పెద్దన్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య పేర్కొన్నారు. 13వ తేదీన నాగన్న స్వగ్రామం రాజారం లో నిర్వహించబోయే నాగన్న సంస్మరణ సభను ప్రజలు, కళాకారులు, ప్రజాసంఘాల కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బండారి పిలుపు నిచ్చారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ తృణప్రాయంగా తిరస్కరించి పేద ప్రజల పక్షాన నిలబడిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ నాగన్న అని ఆయన కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని స్వయంగా గత ప్రభుత్వం ఆహ్వానించినా, ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలనే సంకల్పంతో ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిన అరుదైన విప్లవకారుడని పేర్కొన్నారు. నాగన్న తన జీవితాన్నే కాదు, తన కుటుంబాన్నీ ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన ఆదర్శవంతుడు. రైతులు, కూలీలు, అణగారిన వర్గాల బాధలను తన పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా చైతన్యాన్ని రగిలించిన సాంస్కృతిక యోధుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.
నాగన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాటలు, ఆశయాలు, ప్రజల కోసం సాగించిన పోరాట స్ఫూర్తి ఎల్లప్పుడూ ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ పేద ప్రజల హక్కుల సాధన కోసం మరింత పట్టుదలతో ఉద్యమాలను కొనసాగించడమే నాగన్నకు అందించే గొప్ప నివాళి అని అన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న నాగన్న సంస్మరణ సభకు ప్రజలు, ప్రజాసంఘాలు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఐఎంల్ న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు ఏనుగుల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ నాయకులు మందుల రాజేంద్రప్రసాద్, మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు పోలిప్పొంగు నాగయ్య, పార్టీ డివిజన్ నాయకులు అచ్చా ఉప్పలయ్య, గొర్రెపాటి వీరస్వామి, గడ్డం శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, షబ్బీర్, పట్టాభి, పేరం వెంకటేశ్వర్లు, వీరబోయిన మల్లయ్య, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలయాపాలెం లో విలేకరి కావలెను.
ఎడిటర్: నాయిని శ్రీనివాస రావు
9290 999 316,
9490 999 316.