

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్ ప్రతినిధి, 30.05.2025: పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగులు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. శుక్రవారం సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాదామ్య పథకాలైన దాన్యం సేకరణ, వ్యవసాయం, రుతుపవనాలు, ఇందిరమ్మ ఇండ్లు,భూ భారతి పథకాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా కు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా పంటలు, ధాన్యం సేకరణ, నీటిపారుదల విషయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లాగా పేరుగాంచిందని, నల్గొండ జిల్లా భారతదేశానికి భాండాగారంగా నిలవాలని ఆకాంక్షించారు .నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని అన్నారు. అధికారులు ఇప్పటి వరకు ఉన్న నిర్లిప్తతని వదిలేసి పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని, ముఖ్యంగా రానున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి ప్రజల సేవకు అందరు కలిసి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులందరూ మరింత ప్రతిభావంతంగా పనిచేయాలని కోరారు.

ఇరిగేషన్ విషయంలో కృష్ణాజలాలను పూర్తిగా వాడుకునేందుకు తమ హయాంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేస్తామని చెప్పారు. వివిధ పథకాల అమలులో ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని, సంక్షేమానికి సంబంధించి శాసనసభ్యుల మాటే చివరి మాటగా పాటించాలని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం లోపు సివిల్ పనులన్నింటికీ టెండర్లు, ఇతర అనుమతులన్నీ పూర్తి చేసుకుని వర్షాలు తగ్గిన వెంటనే పనులు చేపట్టే విధంగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మంజూరు చేస్తామని, ఇందుకుగాను స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్లతో ఆయన కోరారు. నల్గొండ జిల్లాకు అదనంగా ఏఈఓ లు కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఏఈఓ లను నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని, అందువల్ల వెంటనే అవసరమైనంత మంది ఏఈఓ లను నియమించుకుని ప్రభుత్వానికి అనుమతి కోసం రాయాలని ఆయన సూచించారు.

జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. రాష్ట్రం లో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందని, అందువల్ల రైతులు పామాయిల్ తోటలు పెంచాలని, ప్రత్యేకించి నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కువ అవకాశం ఉన్నందున సూర్యాపేట నల్గొండ మధ్యన ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. వరి పంట వేసి ఇబ్బందులు పడవద్దని, అలాగే ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గించాలని, డిమాండ్ ఉన్న పంటలు వేయాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా ధాన్యం సేకరణ చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను ప్రత్యేకించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు. వచ్చే సీజన్ నుండి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు , ధాన్యం ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం లో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధించలేని విధంగా దాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగిందని, మే 29,2023 నాటికి రాష్ట్రంలో యాసంగిలో కేవలం 47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్నీ కొంటె, ఈ సంవత్సరం మే 29 నాటికి 67 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని , గత సంవత్సరంతో పోలిస్తే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా కొన్నామని తెలిపారు. 2023 లో యాసాంగి లో ధాన్యం అమ్మిన రైతులకు 3,600 కోట్ల రూపాయలు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఈ సంవత్సరం 13250 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగిందని తెలిపారు. సన్న బియ్యం పై సుమారు 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, గతంలో రెండు కోట్ల 87 లక్షల మందికి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దొడ్డు బియ్యం అందించగా, 70% అక్రమంగా తరలించబడిందని, తమ ప్రభుత్వం సన్న బియ్యం పండించిన రైతులకు 500 బోనస్ ఇచ్చామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తూన్నామని , అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో బియ్యంతో పాటు, ఇతర రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. రానున్న 5 సంవత్సరాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. కాలేశ్వరం లేకున్నప్పటికీ ఈ వర్షాకాలం యాసంగి లో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అన్ని ప్రాజెక్టులకు ఆయకట్టు ప్లాన్ సంసిద్ధంచేసి ముందే ప్రకటిస్తామని, ఎస్సారెస్పీ లో ఒండ్రు మట్టి తొలగించడం తో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులలో ఒండ్రు మట్టిని తొలగించి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని, గతంలో మొదలు పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేస్తామని, నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపించాలని, ఈ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించి లబ్ధిదారులను సంబంధిత శాసన సభ్యులు, ఇంచార్జి మంత్రుల ద్వారా ఎంపిక చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, తదితర పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని, ఎట్టి పరిస్థితులలో నిబంధనలను ఉల్లంఘించవద్దని ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . రాజీవ్ యువ వికాసంలో బ్యాంకర్లు లబ్ధిదారుల సిబిల్ స్కోర్ ను అడగ వద్దని అన్నారు. అన్ని పథకాలను అర్హత ఉన్న వారికే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితులలో అర్హత నిబంధనలను అధిగమించవద్దని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కు అదనపు గోడౌన్లు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట ఫారెస్ట్ భూములాన్నిటికి తిరిగి పచ్చ దనం తీసుకువచ్చేలా అవసరమైతే తన ఎమ్మెల్యే నిధుల నుండి నిధులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని, రాష్ట్రం దేశంలోనే ముందుండేలా పని చేయాలని,జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి 24 గంటలు అందుబాటులో ఉండి పారదర్శకంగా పనిచేయాలని, అలసత్వాన్ని వీడాలని, అవినీతిని సహించేది లేదని, ప్రత్యేకించి రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఉండరాదని, ప్రతి పథకం నిరుపేదలకు అందుబాటులో ఉండాలని, వచ్చే సమీక్ష సమావేశాలలో సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలపై సమీక్షించడం జరుగుతుందని, గడచిన పదేళ్లలో అధికారుల అలసత్వం ,అవినీతికి ఎక్కువగా అవకాశాలు ఉండేవని, తమ ప్రభుత్వంలో వాటన్నిటిని విడనాడాలని హెచ్చరించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 12 లక్షల భూములు సాగు లో ఉన్నాయని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా పండించామని, ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ను ఆయన అభినందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్నింటిలో ముందు ఉంచేందుకు అధికారులు ఇలాగే ముందుకు వెళ్లాలని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కలెక్టర్లది ముఖ్య పాత్రని, సన్న బియ్యం వల్ల ప్రభుత్వానికి మంచి పేరువచ్చిందని, రాజీవ్ యువ వికాసం ద్వారా వేలాది మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నైపుణ్యాల అభివృద్ధి వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాముల అవసరం ఉందని, అందువల్ల అదనపు గోదాములు మంజూరు చేయడమే కాకుండా, క్లస్టర్లను, ఏఈవో పోస్టుల ను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తన శాఖ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా కు అత్యధికంగా 1700 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని ఆయన వెల్లడించారు.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఛామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఇంకా కొంతమంది మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈ అంశంపై దృష్టి సారించాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అనర్హులు జాబితాలో లేకుండా చూసుకోవాలని, ఏలాంటి ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ముందుగానే ధాన్యం సేకరణ పూర్తి చేయడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని, అలాగే ఇరిగేషన్ పనులు నడుస్తున్నాయని తెలిపారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇసుక ఇచ్చేందుకు మిర్యాలగూడలో ఇసుక డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని కోరారు.
నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వానకాలం పంటలపై అవగాహన కల్పించాలని, ముఖ్యంగా వానకాలం సీజన్ కు సంబంధించి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అవకతవకలకు తావు ఇవ్వకుండా చూడాలని కోరారు.
ఎమ్మెల్సీ శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేయడం సంతోషమని ,సన్న బియ్యం పై మంచి అభిప్రాయం ప్రజల్లో ఉందని, ఎంతో మంది గుడిసెల్లో నివసించే వారికి ఇల్లు రాలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషమని అన్నారు.
మరో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ చివరికి వచ్చినప్పటికీ, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇండ్లను లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణ చేసుకోవాలని, రైతులు నకిలీ విత్తనాలు బారినపడకుండా దృష్టి కేంద్రీకరించాలని, పేదలకు ఇళ్లు వచ్చేలా అనర్హులకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు .
రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వ్యవసాయంపై సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేయగా, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వారి వారి జిల్లాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ సమావేశానికి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ,కలెక్టర్లు , జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




