
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 04.05.2025: అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం మే నెలలో జరుపుతారు. ఆలయంలో జరిగే ఉత్సవాలు, కార్యకలాపాలను తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం మండలి పర్వేక్షణలో జరుగుతాయి. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.
తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారంఈ ఏడాది మే 11 రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.
మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. రెండోరోజు బండవేషం.
మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడో రోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. నాలుగో రోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు.
స్థలపురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది
నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీని కోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు.
పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




