
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 17.03.2025: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ కమిటీల ఆధ్వర్యంలో మార్చి 10 నుండి 16 వరకు సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుండి 16 వరకు ప్రజా సమస్యల పరిష్కారానికై సర్వే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ సర్వే సందర్భంగా సూర్యాపేట పట్టణంలో అనేక సమస్యలు పార్టీ దృష్టికి వచ్చిందన్నారు. సూర్యాపేట పట్టణంలో శివారు ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. అనేక వార్డులలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధిలైట్లు, త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో దోమలు విపరీతంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో ఉన్న భూమిలేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంత పేదలను ఆదుకునేందుకు ఉపాధి హామీ పనులు అన్ని వార్డులలో కల్పించాలన్నారు.

రేషన్ కార్డు లేక ప్రజలు గత 11 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారులు పింఛన్లు కొన్ని సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలన్నారు. మహిళలకు గృహలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, మట్టిపల్లి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, మేకన బోయిన శేఖర్, మద్దెల జ్యోతి, వీరబోయిన రవి, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం టూ టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి, సిపిఎం 3 టౌన్ కార్యదర్శి చెట్లంకి యాదగిరి, సిపిఎం పార్టీ రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మేకన బోయిన సైదమ్మ, మందడి రామ్ రెడ్డి, కోట సృజన, కంచు గట్ల శ్రీనివాస్, నారాయణ వీరారెడ్డి, అర్వపల్లి లింగయ్య, పందిరి సత్యనారాయణ రెడ్డి, కామ్రేడ్ శ్రీనివాస్, రెడ్డి మోహన్ రెడ్డి, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, గుండాల పుల్లయ్య, ఒట్టే ఎర్రయ్య, కప్పల సత్యం, బుద్ధ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




